Monday, April 6, 2015

ఆలోచించండి, మనకోసం, మన పిల్లలకోసం ....

ముగ్గుపోయాలన్నా, మూల వాసం పెట్టాలన్నా వడ్ల బ్రహ్మయ్యనే సాటి...’, మట్టి కచ్చుతో గోడ కట్టాలంటే సుతారి సాయన్ననే తిరుగులేని మేస్ర్తి. ‘గోడలకు మల్లంపెట్టి, గచ్చుచేయాలంటే తూర్పు నర్సయ్యనే మొనగాడు...’లాంటి మాటలు ఒకప్పుడు గ్రామాల్లో ఇల్లు కట్టాలనుకున్న సందర్భంగా వినే వారం. పూర్తి స్థానికత ఆధారంగా లభించే వస్తువులతో ఇల్లుకట్టే నైపుణ్యం ఒకప్పటి మాట. ఇప్పటికీ ఈ అనుభవం ఆయా ప్రాంతాల్లో కనపడుతూనే వుంది. ఈ విధానం ప్రకృతి అనుబంధంగా, అనుకూలంగా వుండేది.
తుంగభద్ర నదీ తీర ప్రాంతంలో రాజధాని నగరాన్ని నిర్మించడానికి హరిహర, బుక్కరాయలు ఎంచుకున్న విధానం ఇప్పటికి చరిత్ర పుటల్లో కనపడుతూనే వుంది. ఆ ప్రాంతంలో లభించే రాయితో విజయనగర సామ్రాజ్యం నిర్మితమై దాదాపుగా 230 సంవత్సరాలు పాలన సాగించింది. వేట కుక్కల్ని కుందేళ్ళు తరిమిన ప్రాంతమని, వీరత్వానికి ఆ ప్రాంతం నిదర్శనమని, అనుగుణంగా మంచి ముహూర్తంలో నిర్మిస్తే రాజధానికి తిరుగుండదని భావించి, ముహూర్త సమయానికి శంఖాన్ని ఊదుతామని, అప్పుడే శంఖుస్థాపన చేయాలని భావించగా, బిచ్చమెత్తుకునే జంగందేవర వూదిన శంఖంతో శంఖుస్థాపన చేసినా విజయనగర సామ్రాజ్యం ఎంతోకాలం విరాజిల్లింది. ప్రణాళికా రచన నుంచి, పైకప్పు వేసేదాకా, స్తంభాల నుంచి నేలపై పరిచే రాళ్ళదాకా తొలిచింది, తీర్చిదిద్దింది స్థానికులే? అందుకే ఆ శిథిలాలలో రాయల వంశీయులు చిరంజీవులని కీర్తిస్తాం!
పశ్చిమాన వున్న రాజస్థానంతా పెదపెద్ద కోటల మయమే! పాకిస్తాన్ సరిహద్దులో వున్న జైసల్‌మేర్ నుంచి మొదలుకొని భిక్‌నేర్, జైపూర్, జోద్‌పూర్, ఉదయ్‌పూర్, చిత్రోడ్‌గఢ్ దాకా అద్భుతమైన, దుర్భేద్యమైన కోటలు నేటికి చెక్కుచెదరకుండా కనపడుతాయి. పక్కనగల ఆగ్రా కోట, ఢిల్లీలో ఎర్రకోటలు మనం నిర్మించుకున్నవే! అందాలను ఆరబోసే తాజ్‌మహల్‌కు ఏ విదేశీయులో ప్లాన్ ఇచ్చినట్లు చరిత్ర పుస్తకాల్లో కనపడదు. కాశీరాజుల కోటలు, ఆపైన గల అయోధ్యలోని వందలాది హిమారత్‌లు (అతిపెద్ద భవనాలు) ఇప్పటికి చూపర్లను కట్టివేస్తాయి. దక్షిణానగల మందిరాలు, గాలి గోపురాలు సరేసరి! మధురై, రామేశ్వరం, పద్మనాభ ఆలయం, ఒకటేమిటి చిదంబరం, కుంభకోణం ఇప్పటికి చిదంబర రహాస్యాలే! లేపాక్షి బసవన్నను చెక్కిన జక్కన్నలు ఏ గుడిలో చూసినా ప్రతిబింబిస్తారు. రాతితో గొలుసుల్ని తయారుచేసిన చతురత ఏ ఐఐటిలో రూపొందలేదు. ఏ విశ్వవిద్యాలయంనుంచి పట్టా పొందలేదు. మొన్నటికి మొన్న 2013లో ప్రకృతి బీభత్సానికి గురైన కేదార్‌నాథ్ ఆలయ పునాదులు చెక్కుచెదరలేదని చెన్నై ఐఐటి నిపుణులు తేల్చిచెప్పడం గమనార్హం!
క్రీస్తుపూర్వ నాగరికత చిహ్నాలుగా సింధూ నాగరికతను, మొహంజోదారో, హరప్పాల గూర్చి అవపోసన పడతాం. కాల్చిన ఇటుకలతో, మురుగు నీటిపారుదల సౌకర్యాలతో, స్నానపు గదులతో ఆనాడే అలరారాయని చారిత్రిక పుటలు తెలుపుతున్నాయి. తక్షశిల, నలందా, నందికొండల్లో వేయి, రెండువేల సంవత్సరాల క్రితమే బ్రహ్మాండమైన కట్టడాలతో విశ్వవిద్యాలయాలు నడిచాయని ఆధారాలతో చూపుతున్నాం. ధాన్యాన్ని దాచడానికై నిర్మితమైన ధాన్యకటకం ఇప్పటికి కొత్త రాజధానిగా మారబోతున్న అమరావతిలో చూస్తాం. దేవగిరి, బీదర్, గుల్బర్గా, గోల్కొం డ, ఏకశిల కోటలన్నీ శాస్ర్తియతకు లోబడే వందల సంవత్సరాలుగా మనుగడను సాగిస్తున్నాయి. తెలంగాణ గ్రామ గ్రామానగల కోట గోడలు, బురుజులు ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కల్గిస్తాయి. ఈ నిర్మాణాలన్నింటికీ రాళ్ళెత్తిన కూలీలెవ్వరనే ప్రశ్నకు అతీతంగా ఆలోచించినా వీటి నిర్మాణ వ్యూహరచనలన్నీ నికార్సైన స్థానికులవే! ఆనాటి రాచరికభావజాలం, నిరంకుశత్వం, నిర్మించిన రాజు పేరు తప్ప అసలు, సిసలైన వ్యూహకర్తల, నేర్పరుల, నిపుణుల పేర్లు చరిత్రలో కనబడవు. ఈ నైపుణ్యతలే ఆనకట్టల్లో, వంతెనల నిర్మాణాల్లో కనపడుతాయి. ఇలాంటి వందలాది అద్భుతాల్ని సృష్టించి, ఓ వారసత్వ సంపదగా అందించిన ఘనత ముమ్మాటికి స్థానికుల ఘనతనే! వారు హిందువులా, ముస్లింలా, సిక్కులా, ఫారసీకులా, బౌద్ధులా, జైనులా అనేది అప్రస్తుతం. ఎలాంటి రహదారి సదుపాయం లేని రోజుల్లో వౌంట్ ఆబు పర్వతంపైకి పెద్దపెద్ద పాలరాతి ఖండాల్ని తరలించి 11వ శతాబ్దంలోనే అద్భుతమైన జైన దేవాలయ సముదాయాల్ని నిర్మించింది పక్కా భారతీయులే!
మన ఇతిహాసాలు సరేసరి! దుర్యోధనుడు భంగపడిన మయసభ, రావణబ్రహ్మ రాజప్రసాదం రూపుదిద్దుకున్నది విశ్వకర్మ చేతుల్లోనేగా మనం ఇప్పటికి గాథలుగా చెప్పుకుంటున్నది. ఇలాంటి మయసభలు నేటికి అనేక అంతఃపురాలలో కనపడుతూనే వున్నాయి. ఇలాంటివన్నీ మనుబ్రహ్మ (కమ్మరి), మయబ్రహ్మ (వడ్రంగి), త్వష్టబ్రహ్మ (కంసాలి), శిల్పి బ్రహ్మ (కాశి), విశ్వజ్ఞబ్రహ్మ (అవుసుల) తదితరుల చేతి నైపుణ్యాలతోనే తీర్చిదిద్దబడ్డాయి. నాటి భారతదేశాన్ని ప్రపంచంలోనే తలెత్తుకునేలా గర్వపడేలా చేసాయి. నల్లని రాళ్ళల్లో దాగిన కళ్ళను, బండల మాటున గల గుం డెల్ని ఇప్పటికి తీర్చిదిద్దుతున్నది అలనాటి విశ్వకర్మవారసులే! ఇలాంటివాళ్ళ నైపుణ్యంతోనే అలనాడు జైపూర్, మైసూర్, పాత హైదరాబాద్ తదితర పట్టణాలు నేటికి చెక్కుచెదరక అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఈ వాస్తుశిల్పులు, మేస్ర్తిలు, కళాకారులెవ్వరు ఏ ఒక్క ఐఐటిలో పరీక్షలు రాయలేదు. పట్టాలు పుచ్చుకోలేదు. కొన్ని సందర్భాలలో పక్క దేశాల (పర్షియా లాంటి) సలహాల్ని, వాస్తు నైపుణ్యతల్ని సలహాల రూపం లో పొందితే పొందివుండవచ్చు.
కాని, ఇప్పుడేమి మాయరోగం వచ్చిందో- అంతా విదేశీ తంత్రమే! చివరికి నిధుల సేకరణకు కూడా ఓ తంత్రం చెప్పమని నూతన రాజధాని అమరావతికి నమూనా (ప్లాన్) ఇచ్చిన సింగపూర్ ప్రభుత్వానే్న చంద్రబాబు కోరడం వింత అందామా? విడ్డూరం అందామా! నిన్నటిదాకా చరిత్రపుటల్లో లేని హైదరాబాద్ కన్నా ఓ చిన్న నగరాన్ని వేలాది సంవత్సరాల చరిత్రతో, వేదాల్లో, నిగూఢమైన విజ్ఞానంతో, పదుల సంఖ్యలతో అలరారుతున్న ఐఐటిలతో, విశ్వవిద్యాలయాల్లోని ఆర్కిటెక్చర్ కోర్సులతో, సనాతన సంప్రదాయాలతో, సంస్కృతితో ఒకప్పుడు ప్రపంచానికే జ్ఞానాన్ని అందించి, విద్యను నేర్పిన సువిశాల భారత ఖండం ఓ రాజధాని నిర్మాణానికై ప్రణాళికల్ని రూపొందించమని మరో దేశాన్ని కోరడం వింతనా...? విపరీతమా...?
హైదరాబాద్ నగరాన్ని ఐటి నగరంగా తీర్చిదిద్దానని పదే పదే ప్రకటించే బాబుకు అమరావతి చుట్టూ ఐటి పార్కుల నిర్మాణానికి సింగపూర్ అసెండాక్స్ సంస్థ ఆసరా కావల్సి వస్తున్నది. విజన్ 2020తో రాష్ట్ర చరిత్రనే తిరగరాసిన హైటెక్ ముఖ్యమంత్రికి థర్మల్, సహజ వాయు, పవన ఆథారిత సెమ్‌కార్ప్ సంస్థ అవసరవౌతున్నదంటే హైదరాబాద్ అభివృద్ధిలో మన స్వంత పాత్ర ఎంతనో తెలుస్తున్నది. రెండు కోట్ల జనాభాకు 2050నాటకి ప్రణాళికల్ని రూపొందిస్తున్న చంద్రబాబుకు వేలాది రైతు కుటుంబాల్ని (పదివేల మంది భూమిని ఇవ్వమని తిరగబడుతున్నారు.) లక్షకు పైగా జనాభాను ముప్పుతిప్పలు పెడుతున్న విషయం తెలియదనుకుందామా? ఆ కట్టే రాజధానేదో సింగపూర్‌లోనే నిర్మించి, రిమోట్‌తో అక్కన్నుంచే పాలన సాగిస్తే అలిపిరి లాంటి సమస్యలు కూడా తలెత్తవు. ముప్పైమూడువేల ఎకరాల పంట భూముల్నే కాదు, పది లక్షల ఎకరాల్ని పరిశ్రమలకై సేకరించిన తర్వాత ఇక పంట పొలాలకు మిగిలేదేంది? అలాంటప్పుడు పోలవరాన్ని నిర్మించడమెందుకు...? అంటే, పరిశ్రమల దాహాన్ని తీర్చడానికే పోలవర నిర్మాణం అనే విమర్శ నిజంకాదా...? అయితే, తిరిగి గెలిస్తే బాబు 2024దాకా పదవిలో కొనసాగుతాడు. ఆ తర్వాత ఏర్పడే ప్రభుత్వాలు ఈ ప్రణాళికల్ని, ప్రాజెక్టుల్ని కొనసాగిస్తాయా...? ఈ కాలంలో జరిగే విధ్వంసం తిరిగి పునరుద్ధరించబడుతుందా...? అటు బాబు ప్రణాళికలు కొనసాగక, పునరుద్ధరించబడక, మధ్యేమార్గంగా వుంటే కోస్తా, సీమ ప్రజల పరిస్థితేంటి...? బాబేమీ రాజవంశీకుడు కాడు. కోరుకున్నంత కాలం రాజ్యంచేయడానికి. ఏ ప్రభుత్వ మెంతకాలం వుంటుం దో తెలియని అస్థిర ప్రజాస్వామ్యం మనది.
బాబు ఇప్పటికే అమెరికాను అనేకసార్లు చూసాడు. అక్కడి నగరాలు అడవిలోనే నిర్మించబడ్డాయా అర్థం కాకుండా వుంటాయి. భారతదేశ నగరాలన్నీ నదీ తీర ప్రాంతాల్లోనే, సాగుబడి లేని ప్రాంతాల్లోనే సుదీర్ఘకాలంలో నిర్మించబడ్డాయి. అవసరానికి అనుగుణంగా తటాకాలు, వౌలిక సదుపాయాలు, భవంతులు, బంగళాలు, కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించబడ్డాయి. ఏ నిర్మాణం చేపట్టినా స్థానికులకు క్లేశం లేకుం డా నిర్మితమయ్యాయి. ఓవైపు మోడీ మేడ్ ఇన్ ఇండియా అంటుంటే, బాబేమో మేడ్ ఇన్ ఆంధ్రా, బట్ మేడ్ బై, ఫైనాన్స్‌డ్ బై సింగపూర్ అంటున్నాడు. చివరికి సింగపూర్ మంత్రులైన తమిళ తంబిల వారసులు విదేశాంగ మంత్రి కె.షణ్ముగం, వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఎస్.ఈశ్వరన్‌లు బాబుకు సలహాలిస్తుంటే గొలీవర్, గోలియత్ కథలాగానే వుంది. ఏభై సంవత్సరాలలో సింగపూర్ ఏ దేశాన్ని యాచించకుండా, అభివృద్ధిని సాధిస్తే, అభివృద్ధే మంత్రంగా పాలన సాగించిన, సాగిస్తున్న బాబుకు ఇప్పటికీ జోలె పట్టడం తప్పడం లేదు. మన ఆశేష వనరులు, మానవ శక్తులు, మేధో సంపత్తి ఎందుకు న్యాయబద్ధంగా వినియోగించబడడం లేదో అర్థంకాదు. అర్థంచేసుకునే శక్తినికూడా కోల్పో యాం. అటూ కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో మాట్లాడాలన్నా, ఏమైనా చేయాలన్నా నాయకుడే మాట్లాడడం, చేయడం ఓ నిరంకుశ చిహ్నమే! రాచరిక వ్యవస్థ కొనసాగింపే! పేరుకు మంత్రులు, మహానాయకులు. ఎక్క డా నోరువిప్పలేని స్థితి. జాతీయ, ప్రాంతీయ పార్టీలల్లో ఇదే స్థితి. అందుకే అన్ని రాష్ట్రాల్లో అనిశ్చిత పాలననే! కలిసి ఆలోచించడం, కలిసి పనిచేయడం ఒకప్పటి మాట. నాయకుడికి తోచిన విధంగా మాట్లాడడం, అందర్ని చెప్పుచేతుల్లో పెట్టుకోవడం నేటి నిజం.
ఇలాంటి ఆలోచనా ధోరణులు ఇలాగే కొనసాగుతే, ప్రజాస్వామ్యం నిరంకుశంగా పరిఢవిల్లితే, సమాజం సాగేది ముందుకు కాదు- మరింత అప్పుల వూబిలో కూరుకు పోవడమే! ప్రజలు పుట్టిన నేలకు దూరంకావడమే జరుగుతుంది. పరాధీనతనే జీవనయానంగా మారుతుంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఈ విపత్తు కనపడుతున్నది. నేలను కోల్పోయిన రైతులు, ఉంటే కొంతకాలం ఉత్సాహంగా వుండవచ్చు! ఆర్థికంగా సంబరపడవచ్చు! కాని ఆడంబరాలకుపోయి, తాగి తందనాలాడి భార్యాబిడ్డలతో వీధినపడిన కుటుంబాలు రియలెస్టేట్ల భూతంతో, ప్రాజెక్టులతో నిర్వాసితులైతున్న వారిని అన్ని దశలలో చూస్తూనే వున్నాం. అభివృద్ధిపేరున ప్రజల్ని అవస్థలకు గురిచేయడం ఏ విధమైన ప్రజాస్వామ్యమో ఆ నాయకులకే తెలియాలి. ఇది ఎల్లకాలం సాగదని, ఇలాంటివారు చరిత్రలో కోకొల్లలని గుర్తిస్తే నాయకులతో పాటుగా, ప్రజలకు మంచి జరుగుతుంది.

from: http://andhrabhoomi.net/content/r-453

1 comment: